దేశ రాజధానిలో ఓ ఆటోడ్రైవర్పై ఆత్యాచార యత్నం జరిగింది. వినేందుకు కొత్తగా ఉన్నా ఇది నిజం. కాస్త ఆలస్యంగా వెలుగులోకి చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ నుంచి అర్జున్ సాగర్ కు వెళ్లేందుకు రేణు లాల్వానీ(32) అనే మహిళ ఆటో ఎక్కింది. గమ్యస్థానం చేరగానే "కిరాయి ఇస్తాను ఇంట్లోకి రండి " అని ఉమేష్ ప్రసాద్(41) ను ఆహ్వానించింది. తీరా అతడు ఇంట్లోకి వెళ్లాక గడియపెట్టింది. తాగేందుకు నీళ్లు ఇచ్చి, వైన్ తీసుకుంటావా అని అడిగింది. డ్రైవర్ తిరస్కరించడంతో బలవంతంగా వైన్ తాగించేందుకు యత్నించింది.
అంతటితో ఆగకుండా అతని దుస్తులు ఒక్కొక్కటిగా తొలగించి ముద్దుల వర్షం కురిపించింది. ఇంతలోనే రేణు మరో మహిళతో మాట్లాడడం గమనించిన ప్రసాద్ అక్కడి నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకున్నాడు.ఈ క్రమంలో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు రేణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణు నుంచి ఆటో డ్రైవర్కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. రేణు నివాసంలో ఉంటున్న మరో మహిళ టాంజెనియా దేశస్తురాలైన హితిజగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది.